తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత రెండుమూడు నెలల్లో వేట మొదలెడతానని, జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతానని, తనలోని పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

జేసీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను అవినీతికి పాల్పడినట్టు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, ఇకపై ఇలాంటి వాటిని సహించబోనని తేల్చి చెప్పారు. ప్రజలందరినీ భయపెట్టాలన్నది తన ఉద్దేశం కాదన్న ఆయన జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొందరిని లక్ష్యంగా చేసుకుంటానని తెలిపారు. 

ఇది సమయం కాదనే ఊరుకున్నానని, ఎన్నికలయ్యాక మాత్రం పంటకు పురుగు పడితే తీసేసినట్టు ఏరిపారేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. 1985 నుంచి 2004 వరకు ఎలా ఉన్నానో ఆ రూపాన్ని చూస్తారని పేర్కొన్నారు. దారినపోయే ప్రతి ఒక్కరు రాయి వేస్తుంటే ఓపిక నశిస్తోందన్నారు. పాత జీవితంలోకి మళ్లీ వెళ్లాలన్న ఆలోచన ఉందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

  • ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరంలేదన్న గోరంట్ల మాధవ్

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎవరిని కదిలించినా టికెట్ కు సంబంధించిన అంశాలే చర్చకు వస్తున్నాయి. ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, వైసీపీ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేస్తోంది. దాంతో, ఎవరికీ టికెట్ పై గ్యారెంటీ లేకుండా పోయింది! హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈసారి తనకు టికెట్ ఉందని గానీ, లేదని గానీ ఇతరత్రా స్పష్టమైన సమాచారం ఏమీ లేదని అన్నారు. అయితే, తనకు ఈసారి అవకాశం ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను జగనన్న సైనికుడిగానే ఉంటానని, వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. 

ప్రతి చిన్న కులానికి కూడా గుర్తింపునివ్వాలని ఆలోచించి సీఎం జగన్ టికెట్లపై నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోందని, దానికి తామంతా కట్టుబడి ఉంటామని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కులానికి ఎక్కడ టికెట్ ఇచ్చినా, కులం అంతా ఒక్కతాటిపై నిలబడి అభ్యర్థి విజయానికి కృషి చేస్తుందని చెప్పారు.