ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ దాడి

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ దాడి

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ దాడి

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడిచేసి దోచుకుంటున్న హౌతీ రెబల్స్‌కు అమెరికా, దాని 12 మిత్ర దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. దాడులు తక్షణం ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా గతేడాది డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబల్స్ 23 నౌకలపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు, తమ నుంచి కానీ, తమ మిత్ర పక్షాల నుంచి కానీ మరో హెచ్చరిక వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని నొక్కి చెప్పింది.  

ఈ మేరకు అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. ఈ అక్రమ దాడులకు వెంటనే ముగింపు పలకాలని, ఇప్పటికే అన్యాయంగా నిర్బంధించిన నౌకలు, సిబ్బందిని విడిచిపెట్టాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశాయి. ప్రాణాలకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఈ ప్రాంతంలోని కీలకమైన జలమార్గంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని బెదిరించడం కొనసాగితే అందుకు పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించాయి.