హైదరాబాద్‌లో నేరాల రేటు 2 శాతం పెరిగిందన్న నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌లో నేరాల రేటు 2 శాతం పెరిగిందన్న నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌లో నేరాల రేటు 2 శాతం పెరిగిందన్న నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

గత ఏడాదితో పోలిస్తే 2023లో హైదరాబాద్‌లో నేరాల రేటు 2 శాతం మేర పెరిగిందని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో నేర వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2023లో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు మూడు శాతం పెరిగినట్లు చెప్పారు. 2023లో హైదరాబాద్‌లో 24,821 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని... దోపిడీలు 9 శాతం పెరగగా... మహిళలపై నేరాలు 12 శాతం పెరిగినట్లు వెల్లడించారు. అత్యాచారాలు 19 శాతం పెరిగాయన్నారు. కానీ గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై నేరాలు 12 శాతం తగ్గినట్లు తెలిపారు.

వివిధ కేసుల్లో నష్టం విలువ రూ.38 కోట్లు కాగా... పోగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ అయిందన్నారు. ఈ ఏడాది హత్యలు 79, అత్యాచార కేసులు , కిడ్నాప్‌లు 242, చీటింగ్ కేసులు 4,909, రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదయినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 63 శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయని, 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు శిక్షలు పడినట్లు చెప్పారు. ఈ ఏఢాది 83 డ్రగ్ కేసుల్లో 241 మంది అరెస్టయినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 11 శాతం పెరిగాయన్నారు.

ఈ సంవత్సరం ఇన్వెస్ట్‌మెంట్ స్కీంల ద్వారా రూ.401 కోట్ల మోసాలు జరిగాయని, మల్టీలెవల్ మార్కెటింగ్ రూ.152 కోట్ల మోసం జరిగిందని తెలిపారు. ఆర్థిక నేరాలు రూ.10వేల కోట్లకు పైగా నమోదయ్యాయన్నారు. ల్యాండ్ స్కాంలలో 245 మంది అరెస్టయినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్టయ్యారన్నారు. పీడీ యాక్ట్ 18 మందిపై నమోదయినట్లు వెల్లడించారు.

నగర సీపీ... పోస్టింగుల అంశంపై కూడా స్పందించారు. పోలీసుల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయాలు లేకుండా చూస్తామన్నారు. సిబ్బంది సిఫార్స్ లేఖలు తెచ్చి పోస్టింగులు అడిగితే ఎవరికీ ఇచ్చేది లేదన్నారు. సమర్థులైన అధికారులను మాత్రమే విధుల్లో ఉంచుతామని, పోస్టింగుల విషయంలో రాజకీయాలకు తావు లేకుండా చూస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలను రాత్రి 1 గంటలకు ఆపివేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.