హైదరాబాద్‌లో సన్ బర్న్ వేడుకలకు అనుమతినివ్వలేదు: సైబరాబాద్ సీపీ

హైదరాబాద్‌లో సన్ బర్న్ వేడుకలకు అనుమతినివ్వలేదు: సైబరాబాద్ సీపీ

హైదరాబాద్‌లో సన్ బర్న్ వేడుకలకు అనుమతినివ్వలేదు: సైబరాబాద్ సీపీ

2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సన్ బర్న్ ఈవెంట్‌కు అనుమతుల్లేవని సైబరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. సన్ బర్న్ పేరిట నిర్వహించతలపెట్టిన కార్యక్రమంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో సీపీ మహంతి స్పందించారు. ఈ ఈవెంట్ నిర్వహణకు నిర్వాహకులు తమ వద్ద దరఖాస్తు చేసుకున్నారని, కానీ తాము అనుమతి ఇవ్వలేదన్నారు.

మాదాపూర్‌లోని హైటెక్ సిటీ సమీపంలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. అయితే ఇది ఇతర నగరాల్లో జరిగే సన్ బర్న్ వంటి వేడుక కాదని, అందుకే అనుమతులు నిరాకరించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈవెంట్‌ను సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టిక్కెట్ విక్రయాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

జనవరి 1 న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నట్లు తెలిపింది. పబ్ లు, క్లబ్ లు, బార్, రెస్టారెంట్లు, హోటళ్లు ఒంటి గంట వరకు తెరచుకునేందుకు అనుమతించనుంది. అయితే, ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ క్రమంలోనే జనవరి 1 న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 1 ని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు , పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పార్టీలలో డ్రగ్స్ వినియోగం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.