ముగిసిన నారా లోకేశ్ యువగళం .. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ

ముగిసిన నారా లోకేశ్ యువగళం .. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ

ముగిసిన నారా లోకేశ్ యువగళం ..  విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. లోకేశ్ 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర సాగించిన యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో... విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద టీడీపీ యువగళం-నవశకం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేసింది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా విచ్చేస్తున్నారు. 

కాగా, సభా వేదికపైకి చేరుకున్న నారా లోకేశ్ పార్టీ నేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ, పేరుపేరునా పలకరిస్తూ, రెట్టించిన ఉత్సాహంతో కనిపించారు. వేదికపై ఉన్న తోడల్లుడు భరత్ తోనూ ఆత్మీయంగా మాట్లాడారు. లోకేశ్ రాకతో... జై లోకేశ్, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. జనసేన శ్రేణులు కూడా నినాదాలతో హోరెత్తించాయి.

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దాంతో సభా ప్రాంగణం అంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. 

ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. పొత్తు నేపథ్యంలో, నేటి యువగళం సభ ద్వారా ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • ఏపీలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతం కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో నవ్యోత్సాహం పెల్లుబుకుతోంది. లోకేశ్ పాదయాత్ర ఆద్యంతం టీడీపీ శ్రేణలు  కదం తొక్కాయి. నేతలు, కార్యకర్తల మద్దతుతో లోకేశ్ 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్రను కొద్ది సమయంలోనే పూర్తి చేశారు. 

కాగా, యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాదయాత్ర సందర్భంగా ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ... తాము అధికారంలోకి వచ్చాక అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామో ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే ప్రజలు తమను నిలదీయవచ్చని చెప్పారు.

సెల్ఫీ ఛాలెంజ్ లతో నారా లోకేశ్ దూకుడు

యువగళం పాదయాత్ర దారిలో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ లు విసిరారు. తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనుల వద్ద, వైసీపీ అభివృద్ధి పనుల్లో విఫలమైన చోట సెల్ఫీలు తీసుకున్న లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి ప‌నులు - వైసీపీ పాల‌న‌లో సాగుతున్న విధ్వంసం, అవినీతిని సెల్ఫీల‌తో వివ‌రిస్తూ ప్రజ‌ల్ని చైత‌న్యప‌రిచే ప్రయత్నం చేశారు.

సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన

పాదయాత్ర సందర్భంగా తాను బస చేసే ప్రాంతాల్లో తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేశ్ పేరుతో లోకేశ్ ప్రతి రోజు ఓ కార్యక్రమం నిర్వహించేవారు. ఈ కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభించింది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో లోకేశ్ 3.5 లక్షల మందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగారు. 

నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500 మంది లోకేశ్ తో సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమం కారణంగా నంద్యాల నియోజకవర్గంలో యాత్ర చేస్తున్న సమయంలో లోకేశ్ కు తీవ్రమైన భుజం నొప్పి వచ్చింది. ఈ సమయంలో సెల్ఫీలు వద్దని వ్యక్తిగత వైద్యులు వారించిన లోకేశ్ వినలేదు. 

అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తనతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి, ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేశారు. 

సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంతోపాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఓపికగా ఫోటోలు దిగారు.