ఆటో, ఊబర్ డ్రైవర్లతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

ఆటో, ఊబర్ డ్రైవర్లతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

ఆటో, ఊబర్ డ్రైవర్లతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా తమ బతుకుదెరువు దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారితో సమావేశం కానున్నారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లతో సీఎం సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపైనా చర్చించనున్నారు.

కాగా, ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా తమ బతుకులు ఆగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో, ఊబర్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ వచ్చే రెండు రోజుల్లో నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నేడు సీఎం వారితో చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

 పీవీ చెప్పిన మాటల్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి

పీవీ నరసింహరావు తెలంగాణకు లంకె బిందెలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఆయన పీవీ జ్ఞానభూమి వద్ద  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశకీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పీవీ అన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థంగా మారిన పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. బంగారాన్ని కుదువపెట్టి అప్పు తేవడంపై పీవీ ఒక మాట చెప్పారని... తెలివైన వాడు సగం ఆస్తిని కుదువపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని చెప్పారని గుర్తు చేశారు.

భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకు వచ్చిన వ్యక్తి పీవీ అన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని తెలిపారు. పీవీ మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు ఎప్పటికీ ఆచరణీయమన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరు తెలంగాణకు లంకె బిందెలవంటి వారన్నారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని హామీ ఇచ్చారు.