విద్యుత్ కొనుగోళ్ల కోసం గత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ఆగ్రహం

విద్యుత్ కొనుగోళ్ల కోసం గత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ఆగ్రహం

విద్యుత్ కొనుగోళ్ల కోసం గత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందని  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ఆగ్రహం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు తీసుకు వచ్చి తెలంగాణను అత్యంత ప్రమాదకరమైన.. భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. అందుకే ప్రతి విషయం ప్రజలకు తెలియజేయాలని అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉన్న ప్రస్తుత తరుణంలో బాగా ఆలోచించి.. ముందుచూపుతో సాగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ పీకల్లోతు అప్పుల్లో ఉందన్నారు. అన్ని శాఖలను అప్పుల్లో ముంచేశారని ఆరోపించారు. ఒక్క రోజు వృథా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సమీక్ష చేయడం కాకుండా... క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణను సరైన దారిలో తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని మల్లు భట్టి అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ... పథకాలు అర్హులకు అందిస్తామని... వీటి అమలు కాస్త ఆలస్యం కావొచ్చు కానీ... తప్పకుండా చేసి తీరుతామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాపోయారు. అందుకే సంక్షేమ పథకాల అమలు కొంత ఆలస్యం కావొచ్చు.. కానీ వాటిని అమలు చేయడం మాత్రం పక్కా అన్నారు. దుబారా ఖర్చులు మానివేసి... ప్రజల అవసరాలు తీరేలా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయని... కానీ పాలనాపరమైన ఇబ్బందుల వల్ల గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిందన్నారు.

మంత్రులం అందరం సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నామని.. కొన్ని రోజుల్లో ప్రజలతో శభాష్ అనిపించుకునేలా పాలన సాగిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో మంచి మార్పు వచ్చిందని... ఇక్కడి ప్రజల కోరికలు తీరుస్తామని మాట ఇచ్చారు. నిర్బంధ... అవినీతి... అశాంతి... నియంత పాలనను అసెంబ్లీ ఎన్నికల్లో తరిమి కొట్టారన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించినందుకు ప్రజలందరికీ మరోసారి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.