మరోసారి బ్యాంక్ అకౌంట్ అడుగుతారా? కవిత ప్రశ్న

మరోసారి బ్యాంక్ అకౌంట్ అడుగుతారా? కవిత ప్రశ్న

మరోసారి బ్యాంక్ అకౌంట్ అడుగుతారా?  కవిత ప్రశ్న

ఆరు గ్యారెంటీల దరఖాస్తుల విషయంలో ప్రజలలో చాలా సందేహాలు ఉన్నాయని... అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్‌ అకౌంట్ వివరాలు అడగడం లేదని చాలామంది అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుమానం వ్యక్తం చేశారు. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడుతూ... మరోసారి బ్యాంక్ అకౌంట్ అడుగుతారా? లేక కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతోందా? అని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు.

200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తే ఉచితమని చెప్పారని... దీనిని జనవరిలో అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. వచ్చే నెలలో ప్రజలు బిల్లు కట్టాలా, వద్దా? చెప్పాలన్నారు. ప్రజల్లో ఆరు గ్యారెంటీలపై ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. చాలామంది ఇళ్లలో మగవాళ్ల పేరు మీద గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని.. అలాంటి వాళ్లకు రూ.500 సిలిండర్ వర్తిస్తుందా? లేదా? చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతిపై దరఖాస్తు ఫామ్‌లో లేదన్నారు. దీని గురించి ప్రజలకు స్పష్టతనివ్వాలన్నారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ధైర్యం కోల్పోవద్దని సూచించారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమేనని వ్యాఖ్యానించారు. సంయమనం పాటించి.. మన సిద్ధాంతాలతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రజల మనసులను గెలుచుకోవడం ద్వారా మళ్లీ గెలుస్తామన్నారు. ఎవరూ కూడా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్స్: కడియం శ్రీహరి

శ్వేతపత్రాలు... జ్యుడిషియల్ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు అమలు చేయకుండా... చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాస్తవాలు తెలియజేసినందుకు కాంగ్రెస్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని... కానీ ఈ ప్రాజెక్టు వ్యయం రూ.93వేల కోట్లు అని అధికారులు చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం కోసం పెట్టిన ఖర్చును కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకుందని తెలిపారు. రూ.93వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో రూ.1 లక్షకోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని... కానీ 98వేల ఎకరాలకు నీరు ఇచ్చినట్లు అధికారులే చెప్పారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను తాము స్వాగతిస్తున్నామన్నారు.