భారత రెజ్లింగ్ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్

భారత రెజ్లింగ్ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్

భారత రెజ్లింగ్ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్

నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కార్యవర్గాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ రద్దు చేయడం తెలిసిందే. అంతేకాదు, అడ్ హాక్ కమిటీ ఏర్పాటు చేసి భారత రెజ్లింగ్ వ్యవహారాలను పర్యవేక్షించాలంటూ భారత్ ఒలింపిక్ సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో, తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ, క్రీడల మంత్రితోనూ మాట్లాడతానని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ వెల్లడించారు.

నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని, సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరతామని తెలిపారు. తమకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను అర్థిస్తున్నామని, సస్పెన్షన్ ను తొలగించాలన్నది తమ విజ్ఞప్తి అని తెలిపారు. అప్పటికీ ఈ వ్యవహారం పరిష్కారం కాకపోతే న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. 

అండర్-15, అండర్-20 జాతీయ టోర్నీలను ప్రకటించడంలో భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనలు పాటించడంలేదని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. నిబంధనల ప్రకారం టోర్నీకి సిద్ధమయ్యేందుకు క్రీడాకారులకు కనీసం 15 రోజుల సమయం ఉండాలని, కానీ అంత వ్యవధి ఇవ్వకుండానే టోర్నీ ప్రకటించారంటూ రెజ్లింగ్ సమాఖ్యపై కేంద్రం సస్పెన్షన్ వేటు వేసింది.

దీనిపై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందిస్తూ, తాము నిబంధనలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని కేంద్రానికి వివరిస్తామని తెలిపారు. అందుకు ఆధారాలు కూడా సమర్పిస్తామని వివరించారు. 24 రాష్ట్రాల రెజ్లింగ్ సంఘాల ఆమోదంతోనే టోర్నీలపై తాము నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రతిదీ లిఖితపూర్వకంగా ఉందని అన్నారు.

భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడో లేదో... భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించగా, భజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. 

గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించి, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు కావడమే దీనంతటికీ కారణం. 

ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నూతన కార్యవర్గం నిబంధనలు పాటించడంలో విఫలమైందని ఆరోపించింది. 

జాతీయస్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ నెలాఖరులో ప్రారంభం అవుతాయని సంజయ్ సింగ్ డిసెంబరు 21న ప్రకటించారని, నియామవళి ప్రకారం ఓ టోర్నీ ప్రారంభ తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటన చేయాల్సి ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వివరించింది. సంజయ్ చేసిన ప్రకటనతో రెజ్లర్లు టోర్నీకి సిద్దమయ్యేందుకు తగినంత సమయం లేకుండా పోయిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. 

అంతేకాదు, భారత రెజ్లింగ్ సమాఖ్య పూర్తిగా గత కార్యవర్గం అదుపాజ్ఞల్లోనే పనిచేస్తున్నట్టుందని కేంద్రం పేర్కొంది.