తెలంగాణ అప్పు రూ.6,71,757 కోట్లు

తెలంగాణ అప్పు రూ.6,71,757 కోట్లు

తెలంగాణ అప్పు రూ.6,71,757 కోట్లు

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ. 6,71,757 కోట్ల అప్పులో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు ఉండేదని.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇది దాదాపు రూ.7 లక్షల కోట్లకు చేరుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని మండిపడ్డారు. 2014 లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో 100 రోజుల ఖర్చులకు సరిపడా సొమ్ము ఉండేదని భట్టి వివరించారు. ప్రస్తుతం ఇది పది రోజులకు తగ్గిపోయిందని, గత ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలే దీనికి కారణమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, రోజు ఖర్చులకూ రిజర్వ్ బ్యాంక్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం తేడా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెటేతర ఖర్చు విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలలో సరిపడా నిధులను ఖర్చు చేయలేదని చెప్పారు. ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని వివరించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వడ్డీ ( తీసుకున్న రుణాలకు) భారం 34 శాతానికి పెరిగిందని తెలిపారు. మరో 35 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. 2014లో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బడ్జెటేతర రుణాలే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ శ్వేతపత్రంపై సభలో ఉన్న ప్రతి సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నానని చెప్పారు.