No stoppage at Toll System: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్‌ ప్లాజాల దగ్గర ఆగక్కర్లేదు.. కొత్త టోల్ వ్యవస్థ త్వరలో!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్‌ ప్లాజాల దగ్గర ఆగక్కర్లేదు.. కొత్త టోల్ వ్యవస్థ త్వరలో!

No stoppage at Toll System: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్‌ ప్లాజాల దగ్గర ఆగక్కర్లేదు.. కొత్త టోల్ వ్యవస్థ త్వరలో!

Toll Gates : త్వరలోనే కొత్త టోల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో ఇక నేషనల్ హైవేస్‌పై (జాతీయ రహదారులు) టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఆగాల్సిన అవసరమే ఉండదట. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Toll System in India: ప్రయాణికులకు గుడ్‌న్యూస్. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఇక వాహనదారులకు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను త్వరలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ సిస్టమ్‌ అమల్లోకి వస్తే.. ప్రయాణికులు ఇకపై టోల్ ప్లాజాల దగ్గర అర నిమిషం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. దిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఫాస్టాగ్ (FASTag) విధానం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిస్టమ్ స్థానంలో ఎలాంటి అడ్డంకుల్లేని టోల్ వ్యవస్థ (Barrier Less Toll System) లేదా ఓపెన్ టోల్ వ్యవస్థ అమలుకు సంబంధించి ట్రయల్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఇది విజయవంతం కాగానే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ కొత్త టోల్ సిస్టమ్‌తో సామర్థ్యం మెరుగపడటం సహా.. ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అన్నారు. ఇంకా కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపులు చేయొచ్చని స్పష్టం చేశారు.

ఇప్పుడు అమల్లో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థతో టోల్ బూత్‌ల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకండ్లకు తగ్గించగలిగామని చెప్పిన వీకే సింగ్.. ఇప్పుడు ఆ సమయాన్ని సుమారు 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కెమెరాలు, ఉపగ్రహాలు వంటి సాంకేతికత ఆధారంగా ఈ నూతన టోల్ సిస్టమ్ పనిచేస్తుంది.. ఇప్పుడు దిల్లీ- మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు.

''మీరు నేషనల్ హైవేపైకి వచ్చినప్పుడు టోల్ గేట్ వద్ద మీ వెహికిల్ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేసి డేటా క్రోడీకరిస్తుంది. అప్పుడు మీరు ప్రయాణించిన కిలోమీటర్లకు ఛార్జీలు పడతాయ్. టెలికాం సహా అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఈ పురోగతి సాధ్యపడుతోంది.'' అని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇక ఈ ఏడాది మార్చిలో కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇదే అంశంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 6 నెలల్లో తీసుకొస్తామని అప్పుడు చెప్పారు.