వన్నూరమ్మ: బంజరు భూమిలో ప్రకృతి సేద్యం, ప్రధాని మోదీ మెచ్చుకున్న ఆ గిరిజన మహిళ విజయగాథ ఏంటి?

వన్నూరమ్మ: బంజరు భూమిలో ప్రకృతి సేద్యం, ప్రధాని మోదీ మెచ్చుకున్న ఆ గిరిజన మహిళ విజయగాథ ఏంటి?

వన్నూరమ్మ: బంజరు భూమిలో ప్రకృతి సేద్యం, ప్రధాని మోదీ మెచ్చుకున్న ఆ గిరిజన మహిళ విజయగాథ ఏంటి?

“నేను ఒక ఒంటరి మహిళను. భర్త లేడు. నలుగురు పిల్లలను చదివించి, పెద్దవాళ్లను చేసి ఈరోజూ ఎవరి మీదా ఆధారపడకుండా బతికే స్థాయికి చేరుకున్నాను.”

గిరిజన మహిళ వన్నూరమ్మ గర్వంగా చెప్పే ఈ మాటలే ఆమె సాధించిన విజయాలకు ఉదాహరణ.

అందుకే, ఏకంగా దేశ ప్రధాని నుంచే ప్రశంసలు అందుకున్న రైతుగా నిలిచారామె.

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలంలోని దురదగుంట వన్నూరమ్మ స్వగ్రామం.

2010లో ఆమె భర్త చనిపోయారు. ఆ తర్వాత ఒంటరిగానే తన నలుగురు పిల్లలను చదివించి ప్రయోజకులను చేశారు.

ఎందుకూ పనికిరాదనుకున్న తన బంజరు భూమిలో రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు.

ఈ తరహా వ్యవసాయం చేస్తున్న రైతుగా విజయాలు అందుకోవడమే కాదు, ఇప్పుడు ఎంతోమంది రైతులను తనతోపాటూ ముందుకు తీసుకెళ్తున్నారు.

కూలీ నుంచి రైతుగా

మొదట్లో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకున్న ఆమె, ప్రభుత్వ సహకారంతో తన బంజరు భూమిలో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు.

“నేను మొదట ఒక ఎకరాన్ని వ్యవసాయం కోసం తయారు చేసుకున్నాను. తర్వాత నాకున్న మొత్తం భూమిలో ప్రకృతి వ్యసాయమే చేసుకున్నాను. మొత్తం 20 రకాల ధాన్యాలు పండించాను. బంజరు భూమి అయినా పంట చాలా బాగా వచ్చింది. అక్కడే వేరుశెనగ వేస్తే ఆ ఏడాది నాకు లక్ష రూపాయలు వచ్చాయి” అని వన్నూరమ్మ తెలిపారు.

పంటపై వచ్చిన లాభాలనే మళ్లీ వ్యవసాయంపైనే పెట్టుబడిగా పెట్టారు. ప్రకృతి వ్యవసాయం కోసం ఆమె ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా ఉపయోగించారు.

“పంట నుంచి నాకు డబ్బులు వచ్చిన తర్వాత పొలంలో బోర్ వేయించాను. నీళ్లు వచ్చాయి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కింద కూరగాయలు, మొక్కజొన్న, అలసందలు ఇలా రకరకాల పంటలు సాగు చేశాను. అలా వర్షాధార పంటలతోపాటూ డ్రిప్ ఇరిగేషన్ కింద కూడా వ్యవసాయం చేస్తున్నా.” అని చెప్పారామె.

“నా భర్త 2010లో చనిపోయాడు. చాలా కష్టాలు పడ్డాను. నా పిల్లలు దిక్కులేని వాళ్లు కాకూడదని, వారిని ఒక స్థాయికి చేర్చాలని కష్టపడ్డాను. నలుగురి పిల్లల్లో నా కూతురికి, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసేశాను. నా చిన్న కొడుకు ప్రస్తుతం బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇలా వ్యవసాయం చేసుకుంటూనే వారిని ప్రయోజకుల్ని చేశాను” అని అన్నారు.

ఒకప్పుడు నలుగురు పిల్లలను ఎలా పోషించాలో తెలీక దిక్కుతోచని స్థితిలో పడిన తాను ఇప్పుడు పది మంది జీవితాలను సరిచేయగలిగే స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెబుతున్నారు వన్నూరమ్మ.

“మొదట కూలి పనులకు వెళ్లేదాన్ని. రూ.200 కూలి ఇచ్చేవారు. ఆ రూ.200తో నలుగురు పిల్లలను ఎలా పెంచాలి. వారికి ఏం చేయాలని ఆలోచించేదాన్ని. ఇప్పుడు పంటలు పండిస్తూ ఒంటరి మహిళను అయినా గర్వంగా, ధైర్యంగా బతుకుతున్నా. వ్యవసాయం చేసుకుని ఎలా బతకవచ్చో పది మందికి చెప్పి, వారు కూడా బాగుపడేలా చేసే స్థాయికి చేరుకున్నాను” అని చెప్పారు.