తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిపై వివాదం.. టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిపై వివాదం.. టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిపై వివాదం.. టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి విషయంలో వివాదం నడుస్తోంది. నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీ నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. లడ్డూ తయారీలో ఇప్పటి వరకు వినియోగిస్తున్న కర్ణాటక నందిని బ్రాండ్‌ నెయ్యిని టీటీడీ నిరాకరించిందని కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) అధ్యక్షుడు భీమానాయక్‌ అన్నారు. నందిని పాల ఉత్పత్తుల ధరలు పెరగడంతో మరో కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసుకుంటామని టీటీడీ బోర్డు చెప్పినట్లు తెలిపారు.

నందిని మార్కెట్‌లో అత్యుత్తమ నెయ్యిని అందజేస్తుందని.. అన్ని నాణ్యతా తనిఖీల్లో నందిని నెయ్యిను పరీక్షిస్తారని చెప్పారు. ఏదైనా బ్రాండ్ నందిని కంటే తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తే.. నాణ్యత విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. అంతేకాదు ఇటీవల కర్ణాటక కేబినెట్ నందిని పాల ధర లీటరుకు రూ.3 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ.39 ధర ఉండే టోన్డ్ పాలను ఆగస్టు 1 నుంచి లీటరుకు రూ.42కు విక్రయించనున్నారు. మిగతా చోట్ల లీటరుకు రూ.54-రూ.56 మధ్య విక్రయిస్తారు. తమిళనాడులో లీటరు పాల ధర రూ.44గా ఉంది.



ఈ ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. నందిని నెయ్యిని కొనుగోలు చేసేందుకు టీటీడీ అనుమతించడం లేదని కేఎంఎఫ్‌ అధ్యక్షుడు బీమానాయక్‌ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. మార్చిలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఈ-టెండర్లను ఆహ్వానించిందని.. ఇందులో కేఎంఎఫ్‌ పాల్గొనలేదన్నారు. ఫెడరేషన్‌ నుంచి టీటీడీ 20 ఏళ్లగా నెయ్యిని కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు ఈ-టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తున్నామని.. టెండర్లలో ఎల్‌1గా వచ్చిన వారి దగ్గర నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తామన్నారు. ఇదే సమయంలో ఓసారి కేఎంఎఫ్‌ ఎల్‌2గా రాగా ఎల్‌1తో మాట్లాడి ఆ మేరకు నిబంధనలకు కేఎంఎఫ్‌ నుంచి నెయ్యిని కొనుగోలు చేశామన్నారు. టీటీడీ నామినేషన్‌ పద్ధతిలో ఏ నిత్యావసర వస్తువులనూ కొనుగోలు చేయదన్నారు.

టీటీడీ తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఏటా 5 వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ- ప్రోక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. 2023 మార్చిలో కూడా టెండర్లను పిలవగా.. ఆరుగురు ట్రేడర్లు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందారు. 65 శాతం నెయ్యిని L-1 నుంచి, మరో 35 శాతం నెయ్యిని L-2 నుంచి కొనుగోలు చేస్తున్నారు. టీటీడీ మళ్లీ అక్టోబర్‌లో మరో 6 మాసాలకు నెయ్యి కొనుగోలు కోసం టెండర్లను పిలవనుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి నాణ్యతలో రాజీ లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారానే కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.