అమెరికాపై నేరుగా విమర్శలు, జపాన్కు ప్రశంసలు.. జైశంకర్ దూకుడు
అమెరికాపై నేరుగా విమర్శలు, జపాన్కు ప్రశంసలు.. జైశంకర్ దూకుడు

ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల గురించి సాధారణంగా మంత్రులు ప్రజలతో పంచుకోని సమాచారాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పంచుకున్నారు.
అమెరికాతో రక్షణ ఒప్పందాలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, కానీ రక్షణ పరికరాల సరఫరాకు అమెరికానే తటపటాయించిందని ఆయన చెప్పారు.
అమెరికా మిలటరీ ఒప్పందాల విషయంలో వ్యవహరించిన తీరును ఆక్షేపిస్తూ, వివిధ అంశాల్లో జపాన్ సహకారాన్ని ఆయన ప్రశంసించారు. జపాన్ తోడ్పాటు భారత్లో విప్లవాత్మక మార్పులకు వీలు కల్పించిందని జైశంకర్ చెప్పారు.
వ్యూహాత్మక భద్రతా సంస్థ ‘క్వాడ్’లో భారత్కు అమెరికా, జపాన్ రెండూ మిత్ర దేశాలే.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికాను సందర్శించిన సమయంలో రెండు కీలకమైన ఒప్పందాలు జరిగాయని జపాన్-భారత్ ఫోరమ్ సందర్భంగా భారత్కు వచ్చిన జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి ముందు జైశంకర్ చెప్పారు.
ఒకటి జీఈ ఏరోస్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ మధ్య జరిగిన జీఈ 14 ఇంజిన్ తయారీ ఒప్పందం. మరొకటి ‘హైఆల్టిట్యూడ్ యూఏవీల’ కొనుగోలు, అసెంబ్లింగ్ ఒప్పందం.
‘‘అమెరికా నుంచి ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్కు ఎటువంటి సమస్య లేదు. కానీ, అమెరికానే చాలా ఏళ్లు వాటిని మాకు సరఫరా చేసేందుకు వెనకాడుతూ వచ్చింది’’ అని జైశంకర్ చెప్పారు. భారత్-అమెరికా అణు ఒప్పందం తర్వాత అమెరికా వెనకాడటం తగ్గిందని ఆయన తెలిపారు.
ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ హయాంలో కుదిరింది.